అన్నదాతలకు ఇదో అద్భుతమైన అవకాశం. ‘పీఎం కిసాన్ ఎఫ్ పీఓ యోజన’ను కేంద్రం దేశ వ్యాప్తంగా ప్రారంభించింది. కొత్తగా వ్యవసాయ సంబంధిత వ్యాపారం ప్రారంభించాలని ముందుకు వచ్చే చిన్న, సన్నకారు రైతుల కోసం ఈ పథకాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ పథకం కింద 15 లక్షల రూపాయలు అందిస్తుంది. దేశంలోని రైతులందరి కోసం ఈ పథకాన్ని 2019లోనే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.
అయితే.. ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈ పథకం కింద లబ్ధి పొందాలంటే.. 11 మంది రైతులు ఒక్కటై ఒక సంస్థను కానీ కంపెనీని కానీ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అలా సంస్థను ఏర్పాటు చేసుకున్న ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ కు పీఎం కిసాన్ ఎఫ్ పీఓ యోజన ద్వారా 15 లక్షల రూపాయలను కేంద్రం అందిస్తుంది.ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకున్న రైతులకు వ్యవసాయ పరికరాలు, ఎరువులు, విత్తనాలు, మందుల కొనుగోలు చేయడం ఎంతో సులువు అవుతుంది.
ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకున్న రైతులు తమ వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పథకం కింద ప్రయోజనం పొందాలంటే ఎలా దరఖాస్తు చేయాలి? తదితర వివరాలేంటో చూద్దాం..
ఆన్ లైన్ దరఖాస్తు విధానం ఇలా..!
అ) తొలుత నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ అధికారిక వైబ్ సైట్ www.enam.gov.in, ఓపెన్ చేయాలి
ఆ) హోమ్ పేజీలో కనిపించే ఎఫ్ ఈఓపై క్లిక్ చేయాలి
ఇ) ఆ తర్వాత ‘రిజిస్ట్రేషన్’ పై క్లిక్ చేసుకోవాలి
ఈ) దాంతో రిజిస్ట్రేషన్ ఫారం తెరుచుకుంటుంది
ఉ) ఆ ఫారంలో అడిగిన సమాచారం నింపాలి
ఊ) అనంతరం పాస్ బుక్ లేదా చెక్, ఐడీ ప్రూఫ్ ను స్కాన్ చేసి అప్ లోడ్ చేయాలి
ఎ) మనం అప్ లోడ్ చేసిన, ఫారంలో నింపిన వివరాలన్నీ సరిగా ఉన్నాయో లేదో మరోసారి పరిశీలించుకోవాలి
ఐ) ఆ తర్వాత సబ్మిట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి
మీరు అప్ లోడ్ చేసిన దరఖాస్తు ఫారం సబ్మిట్ అవుతుంది.
వివరాలను సంబంధిత అధికారులు పరిశీలించిన తర్వాత ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ కు 5 లక్షల రూపాయలు జమచేస్తారు.అన్నదాతలకు ఆదాయం పెంచడం, అప్పటికే అప్పులతో సతమతం అవుతున్న రైతులను ఆ భారం నుంచి విముక్తి కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న పలు కార్యక్రమాల్లో ‘పీఎం కిసాన్ ఎఫ్ పీఓ యోజన’ ఒకటి. ఈ పథకం ద్వారా రైతులు కొత్తగా వ్యవసాయ సంబంధ వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు. వ్యవసాయం సాగు కోసం చేసిన అప్పులు తీర్చుకుని స్వేచ్ఛగా జీవనం సాగించడం కోసం కేంద్రం ఈ కొత్త పథకాన్ని తీసుకొచ్చింది.