పచ్చని వృక్ష సంపద.. పక్షుల కిలకిలారావాలు.. రకరకాల పాములు, రంగురంగుల కీటకాలు..కనుల విందు చేసే పంటలు.. అన్నింటికీ మించి అధిక ఆదాయం తెచ్చిపెడుతున్న సహజ పంటలు.. ఇవీ కవితా మిశ్రా నిర్వహిస్తున్న పంటలతోటలో మనకు కనిపించే సుందర దృశ్యాలు. మన పొరుగు రాష్ట్రం కర్ణాటకలోని రాయ్చూర్ జిల్లా మాన్వి తాలూకాలో కవిత ప్రకృతి పంటల్ని మనం కళ్లారా చూడొచ్చు. ఈ ప్రగతిశీల ప్రకృతి రైతు లాభదాయకమైన పంటలు దండిగా పండిస్తున్నారు. కవితా మిశ్రా వ్యవసాయ క్షేత్రంలో ప్రకృతి వ్యవసాయంతో పాటు చందనం చెట్లు కూడా పెంచి ఇబ్బడి ముబ్బడిగా లాభాలు ఆర్జిస్తున్నారు.
సైకాలజీలో ఎం.ఏ చేసిన కవితా మిశ్రా కంప్యూటర్ సైన్స్లో డిప్లొమా పట్టా అందుకుని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉద్యోగం చేయాలని కలగన్నారు. అయితే.. కవితా మిశ్రా భర్త ఉమాశంకర్ మాత్రం ఉద్యోగం కోసం తమ గ్రామం విడిచి బయటకు వెళ్లేందుకు ససేమిరా అన్నారు. ఎందుకంటే తమ కుటుంబాన్ని చూసుకోవాల్సిన బాధ్యత కవిత మీదే పెట్టారాయన. ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ నుంచి కవితకు మంచి ఉద్యోగం ఆఫర్ వచ్చినా గ్రామం విడిచి వెళ్లేందుకు ఆయన సున్నితంగా తిరస్కరించారు. తనకున్న 45 ఎకరాలలో 8 ఎకరాలను మంచి వ్యవసాయ క్షేత్రంగా అభివృద్ధి చేయాలని కవితను ఉమాశంకర్ ప్రోత్సహించారు.
కవితా మిశ్రా తమ వ్యవసాయ క్షేత్రంలో ఎలాంటి రసాయన ఎరువులు, పురుగుమందులు వాడకూడదని గట్టిగా సంకల్పించుకున్నారు. కూలీల సాయంతో పొలంలోనే ఆర్గానిక్ ఫెర్టిలైజర్ను కవిత గోమూత్రం, గొర్రెల పెంటతో సొంతంగా తయారు చేయిస్తుంటారు. తమ ఆర్గానిక్ వ్యవసాయ క్షేత్రంలో కవితా మిశ్రా 8 మంది మహిళలకు, ఇద్దరు పురుషులు మొత్తం 10 మందికి ఉపాధి కల్పించారు. వీరితో పాటు ఇంకా పలువురికి కూడా అవకాశం, అవసరాన్ని బట్టి ఆమె ఉపాధి కల్పిస్తున్నారు. ప్రకృతి అనుకూల వ్యవసాయం చేస్తున్న కవితా మిశ్రాకు పలువురి నుంచి ప్రశంసలు వస్తున్నాయి. అంతేకాకుండా మాన్వి తాలూకాలో పలువురు పేద రైతులు సాధికారత సాధించేలా ఆమె సహకారం అందిస్తున్నారు.
కొన్ని సంవత్సరాలుగా చేసిన కృషి కారణంగా దేశంలోనే అత్యంత విజయవంతమైన చందనం రైతుగా కవితా మిశ్రా ఇప్పుడు మంచి పేరు తెచ్చుకున్నారు. దేశ వ్యాప్తంగా చందనం మొక్కల్ని కూడా ఆమె సరఫరా చేయగలుగుతున్నారు. కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్ లిమిటెడ్ (కేఎస్డీఎల్)కు కావాల్సిన చందనం చెట్లు సరఫరా చేసేందుకు కవితా మిశ్రా ఒప్పందం చేసుకున్నారు.
చందనం చెట్ల పెంపకంలో ప్రధానంగా ఎదురయ్యే సమస్య దొంగతనాలు. అయితే.. ఇనిస్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థ రూపొందించిన మైక్రోచిప్ను చెట్లకు అమర్చడం ద్వారా మనం ఎక్కడి నుంచి అయినా నిశితంగా గమనించవచ్చంటారు కవిత. మైక్రో చిప్లు అమర్చడంతో పాటు తన క్షేత్రంలో 8 కాపలా కుక్కల్ని (వాచ్ డాగ్స్)ను కూడా పెంచుతున్నట్లు తెలిపారు.
చూశారుగా రైతన్నలూ.. ఉన్నత చదువులు చదివినా కవితా మిశ్రా ఆర్గానిక్ వ్యవసాయ విధానంలో ఆరితేరిన వైనం.. అవార్డులు అందుకుంటున్న తీరు.. ఆర్గానిక్ పద్దతితో పాటు సమీకృత వ్యవసాయం చేస్తూ లక్షలు ఆర్జిస్తున్న కవితా మిశ్రా మనకు ఆదర్శం.