గోచర భూములు అంటే గోవులు స్వేచ్ఛగా తిరుగుతూ గడ్డి తినడానికి ఉద్దేశించిన భూములు అని అర్థం. గోసంతతి అంటే అర్థం సంతానం మొత్తమని. అంటే ఆవులు, ఎద్దులు, ఆడ దూడలు, మగ దూడలని గ్రహించాలి. గోచర భూములన్నవి పూర్వం ప్రతి గ్రామంలోనూ ఉండేవి. అవి దేవాలయాల అధీనంలో కొనసాగేవి. ఇప్పుడవి కొన్ని చోట్ల ఆక్రమణలకు గురైతే, ఇంకొన్ని చోట్ల ఇతర అవసరాలకు వినియోగించబడుతున్నాయి. దీంతో క్రమంగా గోచర భూములు కనమరుగే అయ్యాయి. ప్రస్తుతం పాల కోసమే ఆవులను పెంచే పరిస్థితి రావడం వల్ల గోపాలన భారంగా మారింది. ఇక్కడ అంతా ఒక విషయాన్ని గమనించాలి. ఆవు ఏడాదిలో ఆరు నెలలు మాత్రమే పాలనిస్తుంది. కానీ మట్టిని సారవంతం చేసే గోమయాన్నీ, మూత్రాన్నీ రోజూ ఇస్తూనే ఉంటుంది. ఈ కోణం నుంచి చూస్తే గోవు మనకిచ్చే గోమయం కానీ, గోమూత్రం కానీ నిజానికి వెలకట్టలేనివి. అవి భూసారాన్ని నిలుపుతాయి. నిరంతరం పెంచుతాయి. అందుకే గోచర భూములను మళ్లీ మనం ఏర్పాటు చేసుకోవాలి. గోవు ఆధారంగా దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి రూపుదిద్దుకోవాలి. కాస్త స్థితిమంతులైనవారు, తగిన వనరులు ఉన్నవారు ఎక్కడికక్కడ గ్రామాలలో గోచర భూములను ఏర్పాటు చేసుకోవాలి. ఇందుకు స్వచ్ఛందంగా వారు ముందుకు రావాలి. చొరవ చూపాలి. దేశీయ గోజాతులను కాపాడుకోవడానికి కృత్రిమ గర్భధారణ (artificial insemination) వంటి పద్ధతుల అవసరం లేకుండా ఆంబోతుల సంచారం కూడా ఉండే విధంగా గోచర భూముల నిర్మాణం మళ్లీ జరగాలి.
గడ్డి, చిన్నచిన్న మొక్కలు తింటూ స్వేచ్ఛగా తిరుగాడే ఆవులు, బర్రెలు, మేకలు, గొర్రెల వంటివి మట్టిలో తమ వ్యర్థాలను (పేడ, మూత్రము) విసర్జిస్తాయి. దీంతో నేలలో నత్రజని, కార్బన్ సహజంగా వృద్ధి చెందుతాయి. దీని వల్ల పచ్చగడ్డితో పాటు మొక్కలూ ఏపుగా పెరుగుతాయి. గడ్డి నేలంతా పరుచుకుంటే మట్టిలో పడిన వాననీరు ఆవిరి కాకుండా ఉంటుంది. అలా మట్టిలో కొన్ని నెలలపాటు తేమ కొనసాగుతుంది. మట్టిలో తేమ ఉండడం వల్ల ఆ చుట్టుపక్కల చెట్లు పెరిగేందుకు అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఆ చెట్లతో వనాలు తయారవుతాయి. అందుకే చిన్నచిన్న పట్టణాల పరిసర ప్రాంతాల్లో గోచర భూముల సంఖ్య పెరగాలి. ఇవి సహజ పర్యావరణాన్ని కాపాడతాయి. పశుసంచారం వల్లనే పచ్చగడ్డి, చిన్నచిన్న మొక్కలు.. వాటి వల్ల పెద్ద పెద్ద చెట్లు మనగలుగుతాయి. పశువులను స్వేచ్ఛగా తిరగాడనివ్వడం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరతాయి. వాటిని కేవలం షెడ్లలో ఉంచి పెంచితే జీవసంపదకు, పర్యావరణానికీ కలిగే ఉపయోగమేదీ లేదు.