రోజువారీ అవసరాలకు మాత్రమే ఆ కుటుంబం ఇప్పుడు డబ్బులు వెచ్చిస్తోంది. అవి కూడా వంటనూనెలు, సుగంధ ద్రవ్యాలకు మాత్రమే వారు డబ్బులు ఖర్చుచేస్తున్నారు. ఆ కుటుంబం మాత్రమే కాదు ఆ ఊరిలోని అనేక మంది ఇలాగే ఆరోగ్యవంతమైన, ఆనందకరమైన జీవనం గడుపుతున్నారు. ఇదంతా ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కృషి ఫలితమే అని చెప్పాలి. రసాయన ఎరువులు, క్రిమిసంహారకాలు వాడే రోజుల్లో ఆ గ్రామంలోని రైతులందరూ నష్టాలు, కష్టాలు పడేవారు. అయితే.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ పార్థసారధి నారా ప్రకృతి వ్యవసాయంలో చేసిన కృషి ఫలితంగా వారంతా సంతోషంగా జీవనం సాగిస్తున్నారు. తన కుటుంబాన్ని, గ్రామాన్ని ప్రకృతి పంటల వైపు ఆకర్షితులయ్యేలా కత నడిపించిన మన యువ రైతు గురించి, పార్థసారథి చేసిన కృషి గురించి తెలుసుకుందాం.
ఇలాంటి కష్ట దశలో పార్థసారథి ప్రకృతి వ్యవసాయ విధానంలో పంటలు పండించడం మొదలెట్టారు. అలా తమ కుటుంబంతో పాటు వందలాది మంది రైతులను కూడా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేలా పార్థసారథి చేయగలిగాడు.
పార్థసారథి 2001లో రాయలసీమ యూనివర్శిటీ నుంచి కంప్యూటర్ సైన్స్లో పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తిచేశాడు. ఆ రోజుల్లో ఐటీ సెక్టార్లో అంతగా ఉద్యోగాలు వచ్చేవి కావు. దాంతో కుటుంబానికి తాను ఆర్థికంగా చేయూతనివ్వలేకపోయాడు. దీంతో తమ కుటుంబాన్ని అప్పుల నుంచి ఎలా బయట పడేయాలనే దారుల్ని పార్థసార్థి వెతికాడు. తమ జిల్లాలోనే కొందరు రైతులు సాంప్రదాయ పంటలు వేరుసెనగ, కంది, వరి పంటలతో పాటు హార్టీకల్చర్ విధానంలో బొప్పాయి పంట పండిస్తున్నారని పార్థసారథి తెలుసుకున్నాడు. అదే విధానంలో పంటలు పండించిన పార్థసారథి 2002లో 10 లక్షల విలువైన ఫలసాయం సాధించాడు. అయితే.. మార్కెటింగ్ అనుభవం లేక తమ వ్యవసాయ ఉత్పత్తుల్ని కొనేవారిని గుర్తించేందుకు కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాడు. ఇక 2004లో పార్థసారథి ఐటీ జాబ్ సంపాదించి అమెరికా వెళ్లిపోయాడు. అయినప్పటికీ అతని ఆలోచనలు అన్నీ వ్యవసాయానికి పూర్వ వైభవం ఎలా తీసుకురావాలా? అనే ఆలోచనల చుట్టూనే తిరిగేవి. ఇలాంటి ఆలోచనల పరంపరలోనే కేవలం నాలుగేళ్లకు అంటే 2008లో పార్థసారథి మన దేశానికి తిరిగి వచ్చి, బెంగళూరులో ఐటీ ఉద్యోగం చేసేవాడు. బెంగళూరులో ఉంటూనే వారం విడిచి వారం వారాంతాల్లో తన సొంతూరు వచ్చేవాడు. అక్కడ అరటి పంటతో పాటు బత్తాయి తోటను ఐదేళ్ల పాటు సేంద్రీయ విధానం పెంచాడు. తమ పొలంలోని కొంత భూమిని అరటి పంట పండించేందుకు అద్దెకిచ్చాడు. తాము పండించిన పంటలో 40 శాతం మాత్రమే అమ్మగలిగేవాడు. ఓ 30 శాతం పంట వృథా అయ్యేది. మిగిలిన 30శాతం పంటను తమ కుటుంబం వినియోగించుకుంటూనే స్నేహితులకు పంచిపెట్టేవాడు. పార్థసారథి పంట పండించేందు 2009లో 7 లక్షల రూపాయలు ఖర్చు చేస్తే.. పంటను వ్యాపారులకు 11 లక్షల రూపాయలకు అమ్మేందుకు ఒప్పందం చేసుసుకున్నాడు. అయితే.. పంట కొనేందుకు ఒప్పందం చేసుకున్న వ్యాపారి 6 లక్షలు మాత్రమే చెల్లించాడు. దీంతో కొంత నష్టాన్ని పార్థసారథి చవిచూడాల్సి వచ్చింది.
2015 నాటికి తమ మొత్తం వ్యవసాయం రసాయన రహిత ప్రకృతి పంటల పండించే దిశగా అడుగులు వేశాడు. గతంలో ఒక్కో అరటి చెట్టు నుంచి 40-50 కిలోల పంట మాత్రమే వచ్చేది. అయితే.. ప్రకృతి విధానంలో 70 కిలోల వరకూ ఉత్పత్తి సాధించాడు. తర్వాత పార్థసారథి, ఆయన కుటుంబం ఓ 3 ఎకరాల్లో పైలెట్ ప్రాజెక్టుగా కూరగాయ పంటలు వేశారు. అందులో కూడా అనుకున్న దానికంటే ఎక్కువగా పంట వచ్చింది. ఆ పంటను పట్టణాల్లోని మార్కెట్లలో విక్రయించాడు. పార్థసారథి ప్రకృతి పంటలకు పట్టణాల్లో మంచి ఆదరణ వచ్చింది. తన ఆర్గానిక్ కూరగాయల్ని తీసుకున్న వినియోగదారుల నుంచి రెండు వారాల్లో 4 వేల మందికి పైగా ఫోన్ కాల్స్ చేసి ప్రశంసించినట్లు పార్థసారథి ఆనందంతో చెప్పాడు. తన వ్యవసాయ విధానాన్ని వ్యవసాయాదికారులు, వ్యవసాయశాస్త్ర విద్యార్థుకు కూడా అభినందించారన్నాడు. దీంతో 20 ఎకరాల్లో ప్రకృతి పంటల కూరగాయలు పండిస్తున్నాడు.
ఇలాంటి రివల్యూషన్నే తాను కోరుకున్నానని పార్థసారథి అన్నాడు. అప్పులు, అనారోగ్యాల బారి నుంచి విముక్తి పొందాలంటే ప్రకృతి వ్యవసాయమే మేలైనదని పార్థసారథి చెబుతున్నాడు.