బత్తాయిలో పుష్కలంగా లభించే విటమిన్ సీ మనలో రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుంది. దీనిలోని జీవరసాయనాలు జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. బత్తాయిలో ఉండే ఫ్లేవనాయిడ్లు జీర్ణాశయాన్ని పరిశుభ్రం చేస్తాయి. బత్తాయిని తరచుగా తినేవారి మూత్రపిండాల్లోని విషపదార్థాలను బయటకు పంపేస్తుంది. మలబద్ధకం సమస్య ఉంటే తగ్గిపోతుంది. తరచుగా బత్తాయిరసం తీసుకుంటే మనలోని చెడు కొలెస్ట్రాల్ ను బాగా తగ్గించేస్తుంది. బత్తాయిలో లభించే పొటాషియం రక్తపోటును నివారిస్తుంది. బత్తాయిలోని కాల్షియం ఎముకల్ని బలంగా తయారుచేయడానికి ఉపయోగపడుతుంది. బత్తాయిపండు తింటే మన మెదడు, నాడీవ్యవస్థ చురుగ్గా తయారవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతారు.
సిట్రిక్ జాతియి చెందిన బత్తాయి రసం చక్కెర వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుంది. బత్తాయిరసంలో కొద్దిగా నిమ్మరసం, తగిన మోతాదులో తేనె కలిపి ప్రతిరోజూ ఉదయాన్ని బ్రేక్ ఫాస్ట్ తో తీసుకుంటే చెక్కెరస్థాయిలో బాగా తగ్గిపోతాయని ఆయుర్వేద వైద్యులు సూచిస్తున్నారు. రోజూ బత్తాయి రసం తాగే వారికి అధిక బరువు తగ్గుతుంది. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుందని వైద్యులు సూచిస్తున్నారు. బత్తాయిలో సీ విటమిన్ తో పాటు పీచు పదర్థాలు, జింక్, కాల్షియం కాపర్, ఐరన్ ఉన్నాయి. బత్తాయిరసం తీసుకుంటే రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. గుండె ఆరోగ్యంగా పనిచేస్తుంది. వంట్లో వేడిని తగ్గిస్తుంది. మూత్రనాళంలో మంట ఉన్నవారు బత్తాయి రసంలో గ్లూకోజ్ లేదా చక్కెర కలిపి తాగితే మంట తగ్గుతుంది. మూత్రా సాఫీగా వెళ్లుంది. బత్తాయి రసం యాసిడ్ గ్యాస్ట్రిక్ ఎసిడిటీని తగ్గిస్తుంది. గోరువెచ్చని నీటిలో బత్తాయిరసం కలిపి తాగితే నోటి అల్సర్, చెడు శ్వాస తగ్గిపోతాయి.
బత్తాయి దిగుబడి ఎక్కువ కావాలని కోరుకునే రైతులు ముందుగా మొక్కలకు ఫార్ములా 6 అంటే జింక్, మాంగనీస్, మెగ్నీసియం, కాల్షియం, బోరాన్, ఐరన్ లను సమృద్ధిగా అందించాలి. బత్తాయి మొక్కకు ఫార్ములా 6 అందించడం అంటే.. తల్లి వేరుకు మాత్రమే ఇవన్నీ అందిస్తే సరిపోతుందనుకోకూడదు. తల్లి వేరు చుట్టూ ఉండే పిల్ల వేర్లుకు కూడా ఫార్ములా 6 పోషకాలు అందించినప్పుడే చెట్టులోని ప్రతి అణుకు, ప్రతి కణమూ బలవర్ధకంగా పెరుగుతుందని ఉద్యానవనశాఖ అధికారులు చెబుతున్నారు. అంటే బత్తాయి మొక్క పిల్ల వేర్లు, పీచు వేర్లు ఎంతవరకు వ్యాపించి ఉంటాయో శాస్త్రీయ పద్ధతిలో ఉద్యానవన శాఖ అధికారి రావుల విద్యాసాగర్ వివరించారు.
ఫార్ములా 6ను బత్తాయి చెట్టుకు పూత రాక ముందు ఒకసారి, పూత వచ్చిన తర్వాత మరోసారి, బత్తాయి కాయ క్రికెట్ బాల్ సైజులో తయారయ్యాక ఇంకోసారి, కాయ పండు అయ్యేందుకు రెడీగా ఉందనే దశకు నెల రోజుల ముందు మరోసారి తల్లివేరు, పిల్ల వేర్లన్నింటికీ అందేలా ఇవ్వాలని ఉద్యానవన శాఖ అధికారి విద్యాసాగర్ సూచించారు. యూరియాను మొక్కలకు భూమి మీద చల్లితో దానిలోని నైట్రోజన్ గాలికి ఆవిరైపోతుంది. అందుకే యూరియా వేసే ముందు చెట్టు చుట్టూ నాలుగైదు సెంటీమీటర్ల లోతు గుంత తీసి దాంట్లో యూరియా వేసి, వెంటనే తేమ ఉండే మట్టితో పూర్తిగా కప్పి, దానిపైన నీళ్లు పెట్టుకుంటే మరింత ఉపయోగం ఉంటుందన్నారు విద్యాసాగర్.
బత్తాయి పంట దిగుబడి ఏటికేడాది తగ్గిపోతున్నాయని, కొన్ని చెట్లు ఎండిపోతున్నాయని కొందరు రైతుల నుంచి వస్తున్న ఫిర్యాదు ఉంది. దాని గురించి కూడా వ్యవసాయ నిపుణులు ఏం చెబుతున్నారంటే.. కర్బన పదార్థం ఉండే పశువుల పేడ, జనుము, జీలుగ లాంటి పచ్చిరొట్ట ఎరువులు వాడకుండా కేవలం రసాయన ఎరువులే విపరీతంగా వాడితే చెట్లు ఎండిపోవచ్చని, దిగుబడి ఎక్కువ రాకపోవచ్చని అధికారి విద్యాసాగర్ హెచ్చరించారు.
బత్తాయి పండించే రైతు అధిక లాభాలు కళ్ల చూడాలంటే కొన్ని మెళకులను ఉద్యానవనశాఖ అధికారి రావుల విద్యాసాగర్ చెప్పారు. సాధారణంగా బత్తాయికి ఎండాకాలంలో ధర బాగా వస్తుంది కనుక ఎప్పుడు కాత రావాలి, ఎప్పుడు పూతరావాలనేది రైతులు నిర్వహించే యాజమాన్య పద్ధతుల బట్టి ఉంటుందని ఉద్యానవనశాఖ అధికారి రావుల విద్యాసాగర్ చెప్పారు. బత్తాయిచెట్టుకు పూత వచ్చినప్పటి నుంచి కాయను మార్కెట్ తీసుకెళ్లే వరకు 240 రోజులు పడుతుంది. అంటే 8 నెలల సమయం అన్నమాట. జూన్, జులైల్లో తొలిపూత వస్తే.. మార్చి నెలలో బత్తాయి కాయ కోతకు వస్తుంది. అందుకే జూన్, జులై, ఆగస్టు లోగా బత్తాయి చెట్టుకు పూత వచ్చేలా చూసుకోవాలన్నారు.
ఇలా చెట్టులోని అన్ని భాగాలకు పోషకాలు సమానంగా, సమృద్ధిగా సరఫరా అయ్యేలా చూసుకుంటే అది ఏపుగా, బలంగా ఎదుగుతుంది. చెట్టు మొదట్లో ఉండే రింగులో పోషకాలు వేస్తే.. కేవలం 10 నుండి 15 శాతం మాత్రమే వేరు పీల్చుకునే అవకాశం ఉంటుంది. మీగతా 85 శాతం వేరు వ్యవస్థ రెండో రింగులోనే ఉంటాయి. అందుకే రెండె రింగుల వ్యవస్థలో యాజమాన్య పద్ధతి పాటించాలని విద్యాసాగర్ సలహా ఇచ్చారు. ఇలా చేసినప్పుడు చెట్టుకు వచ్చిన అన్ని కాయలు, ఒకే సైజులో, పూర్తిస్థాయిలో దిగుబడికి వస్తుందన్నారు. బత్తాయికాయ గోళి సైజులో ఉన్నప్పుడు చెట్టుకు ఐదు గ్రాముల పొటాషియం నైట్రేట్ ను లీటర్ నీటిలో కలిపి పిచికారి చేసుకుంటే చెట్టుకు వేడి పుడుతుందని, మరికొంత పూత కూడా రావడానికి అవకాశం ఉంటుందన్నారు.
ఉద్యానవనశాఖ అధికారి విద్యాసాగర్ చెప్పిన యాజమాన్య పద్ధతులు సక్రమంగా పాటిస్తే.. ఐదు నుంచి ఆరేడు సంవత్సరాల వయసున్న ఎకరం తోటలోని బత్తాయి చెట్ల నుంచి పది టన్నుల దిగుబడి వచ్చే అవకావం ఉంది. టన్ను రూ.20 నుంచి 30 వేలు ధర పలికినా రెండు నుంచి మూడు లక్షల వరకు ఆదాయం వస్తుంది. ఇంతకీ ఇంత ఆదాయం వచ్చిన ఎకరం బత్తాయి తోటను పెంచేందుకు రూ.50 నుంచి 60 వేల వరకు ఖర్చు వస్తుందని విద్యాసాగర్ చెప్పారు. మరీ ఎక్కువ ఖర్చు అయిందంటే లక్ష రూపాయలకు మించి అయ్యే అవకావం ఉండదన్నారు. లక్ష రూపాయలు ఖర్చు వచ్చినా లక్ష నుంచి రెండు లక్షలు లాభం వచ్చే అవకాశం ఉంది. ఉద్యానవనశాఖ కూడా బత్తాయి రైతులకు సబ్సిడీ ఇస్తుందని చెప్పారు. ఒక్కో హెక్టారుకు బత్తాయి మొక్క నాటిన తొలి ఏడాది రూ.9 వేలు, మరుసటి సంవత్సరం రూ.3, మూడో ఏడాది రూ.3 వేలు మొత్తం కలిపి రూ.15 వేలు సబ్సిడీ ఇస్తుందని ఉద్యానవనశాఖ అధికారి విద్యాసాగర్ వెల్లడించారు.