ఆర్గానిక్ పద్ధతిలో.. సేంద్రీయ విధానంతో ఓ యువ రైతు జామ పంట ద్వారా దండిగా లాభాలు గడిస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా రాయచోటి మండలం శిబ్యాల గ్రామం రెడ్డివారిపల్లెకు చెందిన యువరైతు శివప్రసాద్ ఇప్పుడు లాభాల పంట పండిస్తున్నాడు. నిజానికి శివప్రసాద్ పట్టు వదలని విక్రమార్కుడనే చెప్పాలి. అడవి లాంటి ప్రాంతంలో ఏ పంట పండించినా అడవి జంతువులతో రైతన్నకు కష్టాలు తప్పవు కదా. పైగా పంటలు పండించేందుకు అనువైనది కాదని ఉద్యానవనశాఖ అధికారులు రూఢిగా నిర్ధారించిన ప్రాంతం అది. ఉన్నత చదువులు చదివిన శివప్రసాద్ అక్కడే ఎలాగైనా మంచి పంటలు సాగుచేసి చక్కని దిగుబడి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. తనకు తెలిసిన వ్యవసాయ మెళకువలతో జామపంట సాగుచేశాడు శివప్రసాద్. ఆర్గానిక్ జామ పంటలో ఊహించని లాభాలు ఆర్జిస్తున్న శివప్రసాద్ ప్రకృతి వ్యవసాయ విధానంలో పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.
అడవిని తలపించే ప్రాంతం అది. అక్కడ ఏ పంట సాగుచేసినా అడవి జంతువులతో కష్టాలు తప్పదు. పంటల సాగుకు అది అనువైన ప్రాంతం కాదని ఉద్యానవన శాఖ అధికారులు నిర్ధారించారు. అయినా అక్కడే పంటసాగుకు సంసిద్ధుడయ్యాడు. మంచి దిగుబడి రాబట్టాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాడు శివప్రసాద్. ఈ క్రమంలో శివప్రసాద్ జామపంటను ఎంచుకున్నాడు. అసలే అక్కడ విద్యుత్ సౌకర్యం కూడా లేకపోవడంతో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకున్నాడు. ఎకరా పొలంలో ఐదు రకాలకు చెందిన దాదాపు 2,400 జామ మొక్కలు నాటి, ఆర్గానిక్ పద్ధతిలో పెంచాడు. ఇప్పుడు తాను కూడా ఊహించని విధంగా అత్యధిక దిగుబడి రాబడుతున్నాడు. తద్వారా మంచి లాభాలు కూడా పొందుతున్నాడు. శివప్రసాద్ ఇప్పుడు కడప జిల్లాలో పది మందికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.
‘ఎకరా పొలంలో జామ పంట పండించేందుకు లక్షన్నర రూపాయల ఖర్చు చేశాం. ఒక పంట దిగుబడిలోనే మేం పెట్టిన పెట్టుబడులు మొత్తం వచ్చేశాయి. ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి సహకారం అందడం లేదు. జామపంట సాగుకు అనువైన ప్రాంతం ఇది కాదని, అందువల్ల ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందించలే’మని అధికారులు చెప్పేశారన్నాడు శివప్రసాద్ సోదరుడు భాస్కర్. ‘కనీసం ఓజిడి బాక్సులైనా ఇవ్వలని తన సోదరుడు ఉద్యానవన శాఖ అధికారులకు మొరపెట్టుకొన్నా ఫలితం లేదన్నాడు. తాము జామపంట సాగుచేసి రెండేళ్లయినా ఒక్క అధికారి కూడా రాలేదని భాస్కర్ చెప్పాడు.
చూశారుగా రైతన్నలూ.. అనువుగాని చోట కూడా మన యువరైతు శివప్రసాద్ పట్టుదలతో అధికుడిగా నిరూపించుకున్నాడు.