ప్రతి గ్రామపంచాయతీలో కనీసం ఒక్క గ్రామం అయినా నేచురల్ ఫార్మింగ్ పద్ధతిలో పంటల సాగు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. నేచురల్ ఫార్మింగ్లో ‘గోధన్’ లేదా ఆవు పేడ, గోమూత్రంతో తయారుచేసే జీవామృతం, ఘన జీవామృతాలను వినియోగించాలని దేశ వ్యాప్తంగా ఉన్న రైతులకు ఆయన సూచించారు. రసాయన ఎరువుల కోసం భారీగా డబ్బులు వెచ్చిస్తున్న 80 శాతం మంది సన్న, చిన్నకారు రైతులకు నేచురల్ ఫార్మింగ్తో ఎంతో లాభదాయకం అని అన్నారు. ప్రకృతి వ్యవసాయ విధానంలో రైతులు ఒక్క ఏడాదిలో అనేక పంటలు సాగు చేయవచ్చన్నారు. తన సొంత రాష్ట్రం గుజరాత్లో ఇటీవలే నేచురల్/ జీరో బడ్జెట్ ఫార్మింగ్పై జరిగిన సదస్సును ఉద్దేశించి ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు.
ఛత్తీస్గఢ్లో కొనసాగుతున్న గోధన్ న్యాయ్ యోజన మాదిరిగానే కేంద్రం కూడా రైతుల నుంచి ఆవుపేడ కొనుగోలు పథకాన్ని జాతీయ స్థాయిలో తీసుకురావాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సు చేసింది. ఆవుపేడ కొనుగోలు చేయడం ద్వారా రైతులకు ఆదాయం సమకూరడమే కాకుండా రోడ్లపై తిరిగే పశువుల సమస్య పరిష్కారం అవుతుందని, దేశంలో ఆర్గానిక్ వ్యవసాయ సాగు విధానాన్ని ప్రోత్సహించినట్లు అవుతుందని ప్రధాని మోదీ చెప్పారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సుకు వ్యవసాయ మంత్రిశాఖ బదులిస్తూ.. దేశ ఈశాన్య ప్రాంతంలో ‘పరంపరాగత్ కృషి వికాస్ యోజన (పీకేవీవై), మిషన్ ఆర్గానిక్ వాల్యూ చైన్ డెవలప్మెంట్’ పథకాల ద్వారా ఆవుపేడను కొనుగోలు చేస్తున్నట్లు తెలిపిందన్నారు. రైతులు పండించే ఆర్గానిక్ పంటలను కొనుగోలు చేయడం ద్వారా వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు పేర్కొందని మోదీ చెప్పారు.