అది బంజరునేల.. అంతకు ముందెప్పుడూ ఆ నేలలో పంటలు పండించింది లేదు. అలాంటి నేలలో సహజసిద్ధ విధానంలో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి బంగారు ఫలాలు పండిస్తున్నాడు. వ్యవసాయం అంటే ఓనమాలు కూడా తెలియని అతను ఎలాంటి రసాయనాలు వాడకుండా ఆర్గానిక్ విధానంలో యాపిల్, కివీ పంటలు సమృద్ధిగా పండిస్తున్నాడు.. ఆపైన ఏటా 40 లక్షల రూపాయల ఆదాయం సంపాదిస్తున్నాడు. ఎలాంటి పూర్వపు అనుభవం లేకుండానే బంజరు భూమిలో వ్యవసాయం చేస్తున్న ఆ కృషీవలుడి విజయగాధను తెలుసుకుందాం.
మన్ దీప్ వర్మ 2010లో ఎంబీఏ పూర్తిచేశారు. ఆ తర్వాత మార్కెటింగ్ బిజినెస్ సంస్థలో జాబ్ లో చేరారు. తన జాబ్ లో భాగంగా మన్ దీప్ వర్మ పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులతో నిత్యం కలుసుకునేవారు. నాలుగున్నరేళ్ల పాటు ఐటీ మార్కెటింగ్ ఉద్యోగం చేసిన మన్ దీప్ వర్మకు సరికొత్త అనుభవాన్నిచ్చింది. ఉద్యోగంలో, తన కెరీర్ లో మన్ దీప్ ఏనాడు ఇబ్బంది పడలేదు. ఐటీ సెక్టార్ మార్కెటింగ్ జాబ్ లో చక్కని అనుభవం, ధైర్యం వచ్చిన తర్వాత ఉద్యోగాన్ని వదిలేశారు. కొత్త కెరీర్ ను ఎలా ప్రారంభించాలనే దానిపై మన్ దీప్ ఎన్నెన్నో రకాల ఆలోచనలు చేశారు. ఆ కొత్త కెరీర్ కూడా తనకు అంతకు ముందు అసలేమీ తెలియని సరికొత్తది, తనకే సొంతమైనది, తాను గడించిన విద్యా నైపుణ్యాలతో విభిన్నమైన మార్గంలో నడవాలని నిర్ణయించుకున్నారు.
ఆ భూమి ఎన్నో ఏళ్లుగా ఎలాంటి పంటలు వేయలేదు. మనుషులెవ్వరూ తిరగని ప్రాంతంలో ఉంది. భూమి నిండా గడ్డి, కలుపు మొక్కలు, ఎలాంటి ఉపయోగమూ లేని ఇతర కంపచెట్లతో నిండిపోయి ఉంది. అయితే.. హిమాలయ పర్వతసానువుల్లో ఉన్న ఆ నేల సారవంతమైనదనే నమ్మకం మన్దీప్ వర్మకు ఉంది. ఆ నేలలో పశువుల విసర్జించిన కుళ్లిన వ్యర్థాలు ఉండడంతో పంట పండించడానికి అనువుగా ఉంటుందని భావించారు.