మల్టీ లేయర్ ఆర్గానిక్ ఫార్మింగ్తో అధిక ఆదాయం.. అత్యధిక ఆరోగ్యం.. ఈ సూత్రాన్ని వంటబట్టించుకున్నాడో యువ రైతు.. ఈ విధానంలో ఆ యువరైతు సంవత్సరం పొడవునా వివిధ రకాల కాయగూరలు పండిస్తున్నాడు. విరివిగా లాభాలు కూడా ఆర్జిస్తున్నాడు. మధ్యప్రదేశ్లోని బుందేల్ఖండ్ జిల్లాలో సాగర్ పట్టణానికి చెందిన ఆకాశ్ చౌరాసియా ఒక హెక్టార్ (2.5 ఎకరాలు) భూమిలో మల్టీ లేయర్ పంటలు పండిస్తున్నాడు. సహజసిద్ధ పంటలు పండిస్తున్న ఆకాశ్ చౌరాసియా మిలియనీర్ అయ్యాడు. తన కొద్దిపాటి వ్యవసాయ క్షేత్రంలోనే ఆకాశ్ మల్టీ లేయర్ క్రాపింగ్ విధానం అవలంబిస్తున్నాడు. తన క్షేత్రంలో ఆకాశ్ పలు రకాల పంటలతో పాటుగా వర్మీ కంపోస్ట్ ఎరువు, బయో పెస్టిసైడ్స్ తయారు చేస్తున్నాడు. పంటలతో పాటు పాల ఉత్పత్తి కూడా పెద్దమొత్తంలో చేయగలుగుతున్నాడు. ఈ అన్ని ఉత్పత్తుల ద్వారా మన యువరైతు ఆకాశ్ ఏడాదికి కనీసం 15 లక్షల రూపాయల దాకా ఆదాయం సంపాదిస్తున్నాడు.