చిన్నప్పటి నుంచే తండ్రికి వ్యవసాయంలో చేదోడుగా ఉన్నాడు. దాంతో చదువుకునే అవకాశం రాలేదు. వ్యవసాయంలో సాంకేతికపరమైన శిక్షణ కూడా తీసుకోలేదు. దశాబ్దాలుగా వ్యవసాయం చేస్తున్న అనుభవంతో ఆ రైతు ఇప్పుడు లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్నాడు. అది కూడా సేంద్రీయ వ్యవసాయ విధానంలో మామిడిపంట పండిస్తున్నాడు. లక్షలకు లక్షలు ఆదాయం ఆర్జిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచాడు. అతడే 71 ఏళ్ల వెల్జీభాయ్ బుధియా. గుజరాత్ రాష్ట్రం కచ్ జిల్లాలోని మాధాపూర్ గ్రామరైతు బుధియా. తండ్రితో పాటు తమ 12 ఎకరాల్లో వ్యవసాయం చేసిన బుధియా ఇప్పుడు 75 ఎకరాల్లో ఆర్గానిక్ పంటలే పండిస్తున్నాడు. మనం తినే ఆహారం పండించడం కోసం గతంలో ఎంతగా రసాయనాలు వాడేవారో గుర్తుచేసుకుని గిల్టీగా ఫీలవుతుంటాడు. రసాయనాలతో పంటలు పండించి ప్రజలకు విషాన్ని అందించడం మహాపాపం అంటాడు బుధియా.
తమ పొలంలో చెరకు పండించి, బెల్లం తయారు చేసి, ఎడ్లబండిపై ఊరూరూ తిరిగి అమ్మిన రోజులను బుధియా గుర్తుచేసుకుంటాడు. చెరకు పంట సంవత్సరానికి కానీ చేతికి ఆదాయం వచ్చేది కాదు.. అది కూడా అరకొరగా వచ్చేది. దాంతో ఇల్లు గడవడం కష్టం అయ్యేదని బుధియా చెప్పాడు. ఆర్థిక కష్టాలను తట్టుకునేందుకు కొంత భూమిలో కూరగాయల సాగు ప్రారంభించాడు బుధియా. టమోటా, బెండ, వంగ, కొత్తిమీర, మిర్చి పంటలు పండించి వాటిని సమీప మండీకి తీసుకెళ్లి అమ్మేవాడట. కూరగాయలు అమ్మడం ద్వారా నెలకు 10 నుంచి 12 వేలు వరకు ఆదాయం వచ్చేదట. అలా వచ్చిన ఆదాయం నుంచి డబ్బు ఆదా చేసి తమ పొలానికి సమీపంలోనే 10 ఎకరాలు కొన్నాడు వెల్జీభాయ్ బుధియా. కొన్న పొలంతో కలిపి మొత్తం 22 ఎకరాల్లో బుధియా పత్తి, ఆముదం, వేరుశనగ, మొక్కజొన్న, ఆవాల పంటలు పండించాడు. పంటలు బాగా పండాయి. స్థానికంగా భుజ్ ప్రాంతంలోనే వాటిని అమ్మితే 5 లక్షల రూపాయలు చేతికి వచ్చిందట. ఆ డబ్బులతో బుధియా మరో 50 ఎకరాలు కొనుగోలు చేశాడు. అలా సంవత్సరాల తరబడి తాను పడిన కష్టం కారణంగా తమ కుటుంబం ఆర్థికంగా మంచి స్థితికి చేరిందని చెప్పాడు.
అదే సమయంలో రసాయనాలు వాడకుండా చేసే సేంద్రీయ వ్యవసాయ విధానం గురించి బుధియా విన్నాడట. 1995లో రాజ్కోట్లో జరిగిన రైతుల శిక్షణా శిబిరంలో వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ అశోక్ షాను కలుసుకున్నాడు బుధియా. సాంప్రదాయ వ్యవసాయం పేరుతో రసాయనాలు వాడి పండిస్తున్న పంటలతో ఎంత ప్రమాదమో, నేలతల్లిని అవి ఎంతలా నాశనం చేస్తాయో, మనుషుల ఆరోగ్యాన్ని అవి ఎలా పాడుచేస్తాయో వివరంగా చెప్పారట. ఖర్చు తక్కువ, ఎక్కువ లాభసాటి సేంద్రీయ వ్యవసాయ విధానం గురించి డాక్టర్ అశోక్ షా చెప్పిన మాటలతో బుధియా బాగా ప్రభావితుడయ్యాట. అయితే.. ఆర్గానిక్ సాగు విధానాన్ని బుధియా తొందరగా చేయలేదట. 2001లో గానీ ఆర్గానిక్ పంటల సాగు ప్రారంభించడం వీలు కాలేదట. ఆ ఏడాది బుధియా తన 75 ఎకరాల పొలంలో 10 వేల కేసర్ మామిడి మొక్కలు నాటాడు.
రసాయనాలతో నిస్సారమైన తమ భూమిని సేంద్రీయ విధానంలోకి మార్చే క్రమంలో మూడేళ్ల పాటు ఖర్చులను తట్టుకునేందుకు బుధియా కేవలం కూరగాయలు మాత్రమే పండించేవాడట. సేంద్రీయ విధానంలోకి మారిన తమ పొలం ఇప్పుడు ఎంతో మృదువుగా మారిందని, మట్టిలోకి సూక్ష్మజీవులు తిరిగి వచ్చాయని బుధియా సంతోషంగా చెప్పాడు. దాంతో పాటు డబ్బుల వృథా ఖర్చు తప్పిందని అన్నాడు. సేంద్రీయ సాగు కారణంగా నీటి వినియోగం కూడా బాగా తగ్గిపోయిందని తెలిపాడు. డ్రిప్ ఇరిగేషన్ విధానంతో ద్వారా 60 శాతం నీటి వినియోగం తగ్గించినట్లు చెప్పాడు.
సేంద్రీయ సాగులో విజయాలు సాధించడంతో మాధాపూర్, ఆ చుట్టుపక్కల గ్రామాల రైతులు బుధియా నుంచి సూచనలు, సలహాలు తీసుకుంటున్నారు. రైతులకు సేంద్రీయ సాగులో వ్యక్తిగతంగా సూచనలు, సలహాలు ఇస్తుండడమే కాకుండా ఆన్ లైన్లో కూడా అనేక మంది రైతులకు అవగాహన కల్పిస్తున్నాడు. ఆర్గానిక్ వ్యవసాయంలో విజయాలు సాధిస్తున్న బుధియాను 2021లో ‘నవోమెషి క్రిషక్ అవార్డు’ ఇచ్చి ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్స్ సత్కరించింది. దాంతో పాటుగా నవసారి అగ్రికల్చర్ యూనివర్శిటీ, సర్దార్ కృషినగర్ యూనివర్శిటీ, కచ్లోని ది చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నుంచి కూడా వెల్జీభాయ్ బుధియా అవార్డులు అందుకున్నాడు. ఇప్పుడు బుధియా కొడుకులు, మనవళ్లు కూడా అతని సంప్రదాయాన్నే కొనసాగిస్తుండడం విశేషం. రసాయన పంటలతో చేసిన పాపాన్ని సేంద్రీయ పద్ధతిలో పండించిన ఆరోగ్యవంతమైన ఆహారం అందిస్తూ కడిగేసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు వెల్జీభాయ్ బుధియా వినమ్రంగా చెబుతున్నాడు. శెభాష్ వెల్జీభాయ్ బుధియా!