ప్రకృతి వ్యవసాయం రైతులనే కాకుండా విభిన్నవర్గాలవారిని కూడా విశేషంగా ఆకర్షిస్తోంది. దీనికి డాక్టర్ చెన్నమనేని పద్మ ఒక ఉదాహరణ. ఆమె హైదరాబాద్లోని సరోజినీ నాయుడు వనితా మహావిద్యాలయంలో ఒక అసోసియేట్ ప్రొఫెసర్. తను బోధించే సబ్జక్టు తెలుగు సాహిత్యం అయినప్పటికీ డాక్టర్ పద్మ అంతకంటే ఎక్కువగా ప్రకృతి వ్యవసాయ విధానం విశిష్టతను పదుగురికీ చెబుతుంటారు. నేటి తరం తింటున్నది సరైన ఆహారం కాదంటారు డాక్టర్ పద్మ. “మీరు తినే ఆహారమే మీరు” అన్నది ఆమె సిద్ధాంతం. (పై ఫోటోలో గొడుగుతో ఉన్నవారు డాక్టర్ పద్మ)
2018 డిసెంబర్లో ప్రకృతి వ్యవసాయంపై అధ్యయనం చేసేందుకు ఆమె గుంటూరుతో పాటు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలలో పర్యటించారు. ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలో తెలుసుకోవడంతోనే తన ఆర్తి తీరలేదు. దాని విశిష్టతని బోధించాలని కూడా డాక్టర్ పద్మ నిర్ణయించుకున్నారు. గుంటూరులో జీరో బడ్జెట్ వ్యవసాయ పితామహుడు సుభాష్ పాలేకర్ నిర్వహించిన 20 రోజుల వర్క్షాప్లో ఆమె పాల్గొన్నారు. పాలేకర్ వ్యవసాయ పద్ధతులతో ఆమె విశేషంగా ప్రభావితమయ్యారు.
గుంటూరు నుండి తిరిగి వచ్చాక ఆమె తమ ఇంటి టెర్రాస్పై 2,200 చదరపు అడుగుల స్థలంలో అన్ని రకాలైన కూరగాయలు పండించడం మొదలుపెట్టారు. పాలేకర్ పద్ధతిలో మిద్దెపంట వేసిన తర్వాత 2019లో ఆమె ఇక బజారుకెళ్లి కూరగాయలు కొనిందే లేదు. తన ప్రయత్నం సఫలమవటంలో డాక్టర్ పద్మ ప్రకృతి వ్యవసాయంపై ఔత్సాహికులకు అవగాహన కల్పించేందుకు పూనుకున్నారు. ‘సేవాభారతి’ కోసం ఆమె ఒక వర్క్షాప్ కూడా నిర్వహించారు. సుమారు 200 మందికి ఉచితంగా కూరగాయల విత్తనాలను అందించారు.
మొదట అసలు ఎలాంటి నేలలను వ్యవసాయానికి ఎంచుకోవాలో ఆమె చూపిస్తారు. ఆ తర్వాత ఆర్గానిక్ మెన్యూర్ను ఎలా భూమిలో వేయాలో నేర్పుతారు. సొంతంగా సేంద్రియ ఎరువును ఎలా తయారు చేసుకోవాలో డాక్టర్ పద్మ వారికి చెబుతారు. ప్రకృతికి హానికరంకాని ఎరువులను, పురుగుమందులను ఎలా ఉపయోగించాలో విద్యార్థులకు ఆమె చూపుతారు. విత్తనాల బంతులను తయారు చేయడం కూడా ఆమె వారికి నేర్పించారు. డాక్టర్ పద్మ నిర్వహించిన కార్యగోష్ఠుల వల్ల వందలాది మంది విద్యార్థినులు సేంద్రియ వ్యవసాయం మెళకులను గ్రహించారు. ఎలాంటి ఆహారం తీసుకోవాలో, ఏది ఆరోగ్యకరమో వారికిప్పుడు తెలిసింది. అంతేకాదు, డాక్టర్ పద్మ స్ఫూర్తితో ఒకరిద్దరు సొంతంగా నర్సరీలను కూడా ఏర్పాటు చేసుకోవడం విశేషం.
కుటుంబంలో స్త్రీలకు ఎంతో ప్రాముఖ్యం ఉంటుందనీ, అందుకే వారిపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరిస్తున్నాననీ డాక్టర్ పద్మ చెబుతారు. రసాయన ఎరువుల వల్ల ఆరోగ్యం పాడవడమే కాకుండా అది పర్యావరణాన్ని నాశనం చేస్తుందని ఆమె అంటారు. ప్రకృతి వ్యవసాయం వల్ల భూమి కోతను నివారించవచ్చుననీ, నేలలో నీటిని పట్టి ఉంచే సామర్థ్యాన్ని పెంచవచ్చనీ ఆమె వివరిస్తారు.
- Seema Rajpal