ఏపీ మిల్లెట్ మిషన్ 2022-23 నుంచి 2026-27 ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. గురువారంనాడు వెలగపూడిలోని ఏపీ సచివాలయంలో సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన ప్రస్తుత కేబినెట్ తుది సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. పంటల సాగుకు నీరు కోసం బావులు, బోర్ల మీద అధిక భారం పడకుండా చిరుధాన్యాల పంటలను ప్రోత్సహించేందుకు ఏపీ కేబినెట్ మిల్లెట్ మిషన్ను ఆమోదించిందని సమాచారశాఖ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను భేటీ ముగిసిన తర్వాత పేర్ని నాని మీడియా సమావేశంలో ఈ విషయం వెల్లడించారు.
నీటి లభ్యత తక్కువగా ఉండే ప్రాంతాల్లో ఆరుతడి పంటలను మిల్లెట్ మిషన్ కార్యక్రమం ద్వారా ప్రోత్సహిస్తామని తెలిపారు. చిరు ధాన్యాల పంటలు పండించేందుకు నీటి అవసరం తక్కువ ఉంటుందని, విద్యుత్ వాడకం కూడా స్వల్పంగా ఉంటుందని మంత్రి పేర్ని చెప్పారు. చిరుధాన్యాలకు కనీస మద్దతు ధర అంశం కూడా మిల్లెట్ మిషన్ ద్వారా లభిస్తుందని ఆయన వివరించారు. చిరుధాన్యాల్లో పోషక విలువలు కూడా అత్యధికంగా ఉండడంతో మిల్లెట్ పంటలను ప్రోత్సహించాలని ఏపీ కేబినెట్ మిల్లెట్ మిషన్ తీసుకొస్తోందన్నారు. పోషక విలువలు అధికంగా ఉన్నందున చిరుధాన్యాలు వినియోగించే వారికి ఆరోగ్యం బాగుంటుందని ఏపీ మిల్లెట్ మిషన్ని కేబినెట్ ఆమోదించినట్లు మంత్రి పేర్ని పేర్కొన్నారు.
ప్రకృతి సిద్ధ సాగులో ఏపీని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టేందుకు ప్రత్యేకంగా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కసరత్తు జరుగుతున్నట్లు ఏపీ సీఎం జగన్ తెలిపారు. సహజ సాగులో గ్రాడ్యుయేసన్ ప్రవేశపెట్టాలని సూచించినట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆర్బీకేలను సహజసాగు కేంద్రాలుగా మారుస్తామని జగన్ తెలిపారు. సహజసాగు విధానాలను ప్రోత్సహించేలా సాంకేతికంగా ఆర్బీకేలను పటిష్టం చేస్తామని అన్నారు. సహజసాగు కోసం ప్రత్యేకంగా కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ (సీహెచ్సీ) ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. సహజసాగుకు సంబంధించిన ఉపకరణాలను అందుబాటులో ఉంచి రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పిస్తామని ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు.