రైతు ఎంతగా కష్టించి పని చేసినప్పటికీ ధాన్యానికి, కాయగూరలకు, పండ్లకు తగిన నిల్వ సదుపాయాలు లేకపోతే భారీ నష్టాల బారిన పడక తప్పదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆధునిక నిల్వకేంద్రాలను, శీతలీకరణ సదుపాయాలను అభివృద్ధిపరచడానికి, కొత్త ఫుడ్ ప్రాసెసింగ్ వెంచర్లను ఏర్పాటు చేయడానికి వ్యాపార జగతి ముందుకు రావాలని ఆయన కోరారు. 2020 డిసెంబర్ 18న మధ్యప్రదేశ్ వ్యాప్తంగా నిర్వహించిన కిసాన్ సమ్మేళన్ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. శీతలీకరణ నిల్వ సంబంధిత మౌలిక సదుపాయాల నిర్మాణానికి, మరికొన్ని ఇతర సౌకర్యాలకు ఆయన శంకుస్థాపన చేశారు.
అభివృద్ధి చెందిన దేశాలలో రైతులకు అందుబాటులో ఉన్న ఆధునిక సదుపాయాలు భారతదేశంలోని రైతులకు కూడా అందుబాటులోకి రావాలని ప్రధాని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ప్రపంచ ముఖచిత్రం శరవేగంగా మారుతున్న ఈ తరుణంలో మన దేశంలోని ప్రస్తుత పరిస్థితి ఇలాగే కొనసాగడం ఇక ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదనీ, సదుపాయాలు, ఆధునిక పద్ధతుల లోటు కారణంగా రైతు నిస్సహాయంగా మారుతున్నాడనీ ఆయన అన్నారు.
రాత్రికి రాత్రి చట్టాలు తేలేదు…
వ్యవసాయ చట్టాలపై ఇటీవల జరిగిన చర్చలను గురించి ప్రధాని ప్రస్తావిస్తూ, ఈ వ్యావసాయిక సంస్కరణ చట్టాలకు సంబంధించిన సంప్రదింపులు గడచిన 20-22 సంవత్సరాలుగా సాగుతూ వచ్చాయన్నారు. ఈ చట్టాలను రాత్రికి రాత్రి తాము తీసుకురాలేదన్నారు. వ్యవసాయరంగంలో మెరుగుదల కోసం దేశం లోని రైతులు, రైతుల సంఘాలు, వ్యావసాయిక నిపుణులు, వ్యవసాయ సంబంధిత ఆర్థికవేత్తలు, వ్యవసాయ రంగ శాస్త్రవేత్తలు, మన దేశం లోని ప్రగతిశీల కర్షకులు కూడా నిరంతరం పట్టుపడుతూ వచ్చారని ఆయన అన్నారు. ఈ సంస్కరణలను పార్టీ మేనిఫెస్టోల్లో ప్రస్తావించినప్పటికీ కూడా, వాటిని సిసలైన నిజాయితీతో అమలుపరచడం జరగడం లేదని ప్రధాని విమర్శించారు. ప్రస్తుత వ్యవసాయిక సంస్కరణలు ఇంతకు ముందు చర్చలో ఉన్న వాటి కన్నా భిన్నమైనవి కాదని ఆయన అన్నారు.
స్వామినాథన్ సంఘం నివేదికను మునుపటి ప్రభుత్వాలు 8 సంవత్సరాల కాలానికి పైగా అమలు చేయనే లేదని ప్రధాని విమర్శించారు. రైతులను రాజకీయాల కోసం ప్రతిపక్షం ఉపయోగించుకొంటోందని ఆయన ఆరోపించారు. తమ ప్రభుత్వం రైతుల పట్ల అంకిత భావంతో ఉందని, రైతులను అన్నదాతలుగా భావిస్తోందని ఆయన స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం రైతులకు వారు పెట్టిన పెట్టుబడికి ఒకటిన్నర రెట్ల కనీస మద్ధతు ధర (ఎమ్ఎస్పి)ని ఇస్తూ, స్వామినాథన్ సంఘం నివేదిక లోని సిఫారసులను అమలుచేసిందని మోదీ అన్నారు.
ఇదివరకటి ప్రభుత్వాలు రైతులను గురించి పట్టించుకొన్నట్లయితే, దేశంలోని దాదాపు 100 పెద్ద నీటిపారుదల పథకాలు దశాబ్దాల తరబడి డోలాయమాన స్థితిలో ఉండేవి కాదని ప్రధాన మంత్రి విమర్శించారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం ఈ సేద్యపు నీటి పథకాలను ఉద్యమంగా చేపట్టి పూర్తి చేయడానికి వేల కోట్ల రూపాయలను వెచ్చిస్తోందని ఆయన చెప్పారు. ప్రతి ఒక్క చేనుకు నీరు అందేటట్లుగా చూడటానికి ప్రభుత్వం పాటుపడుతోందని ఆయన అన్నారు. ధాన్యాన్ని ఉత్పత్తి చేసే రైతులకు తోడు, తేనెటీగల పెంపకాన్ని, పశుపోషణను, చేపల పెంపకాన్ని ప్రభుత్వం సమాన స్థాయి లో ప్రోత్సహిస్తోందని ఆయన వివరించారు.
చేపల పెంపకాన్ని వ్యాప్తి లోకి తీసుకురావడానికి నీలి విప్లవం పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి తెలిపారు. కొద్దికాలం క్రితం ‘ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన’ ను కూడా ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ ప్రయత్నాల కారణంగా దేశం లో చేపల ఉత్పత్తి తాలూకు మునుపటి రికార్డులు అన్నీ బద్దలు అయ్యాయని ఆయన చెప్పారు.
కనీస మద్దతుధర కొనసాగుతుంది…
ప్రభుత్వం ఇటీవల తీసుకు వచ్చిన వ్యావసాయిక సంస్కరణల లో అపనమ్మకం ఏర్పడటానికి ఎలాంటి కారణం లేదని, అబద్ధాలకు తావు లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వానికే గనక కనీస మద్ధతు ధర (ఎమ్ఎస్పి)ని తీసివేయాలనే ఉద్దేశ్యం ఉంటే, స్వామినాథన్ సంఘం నివేదికను ఎందుకు అమలుపరుస్తుందో ఆలోచించండి అని ప్రజలను ఆయన కోరారు.
రైతుకు సౌకర్యంగా ఉండటానికే విత్తనాలు చల్లడానికన్నా ముందుగానే ఎమ్ఎస్పి ని ప్రకటించడం జరిగిందని ప్రధాని వెల్లడించారు. కరోనా మహమ్మారితో పోరాడే కాలంలో సైతం ఎమ్ఎస్పి ఆధారిత సేకరణ యథాప్రకారం జరిగిందని ఆయన గుర్తు చేశారు. ఎమ్ఎస్పిని ఇంతకుముందు మాదిరిగానే ఇవ్వడం కొనసాగుతుందని రైతులకు ఆయన భరోసా ఇచ్చారు. ప్రభుత్వం ఎమ్ఎస్పిని పెంచడం ఒక్కటే కాకుండా, ఎమ్ఎస్పి ప్రాతిపదికన చాలా ఎక్కువ గా పంటల సేకరణ కూడా చేపట్టిందని ఆయన చెప్పారు.
దేశం పప్పుధాన్యాల సంక్షోభాన్ని ఎదుర్కొన్న కాలం అంటూ ఒకటి ఉండిందని ప్రధాన మంత్రి గుర్తు చేశారు. పప్పుధాన్యాలను విదేశాల నుంచి తెప్పించేవారని ఆయన అన్నారు. ఈ విధానాన్ని తన ప్రభుత్వం 2014లో మార్చిందని ఆయన చెప్పారు. 2014కు ముందు 5 ఏళ్ల కాలంలో కేవలం ఒకటిన్నర లక్షల మెట్రిక్ టన్నులను మాత్రమే సేకరించగా, ఆ తర్వాత రైతుల నుంచి ఎమ్ఎస్పికి 112 లక్షల మెట్రిక్ టన్నుల మేర పప్పు ధాన్యాలను కొనుగోలు చేసినట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం పప్పు ధాన్యాల రైతులు కూడా ఎక్కువ సొమ్మును అందుకొంటున్నారని, పప్పు ధాన్యాల ధరలు కూడా దిగివచ్చాయని ఆయన అన్నారు.
మండీలో గాని, లేదా బయటగాని విక్రయించడానికి కొత్త చట్టం రైతులకు స్వేచ్ఛను ఇచ్చిందని ప్రధాని స్పష్టం చేశారు. రైతు తన ఉత్పత్తిని ఎక్కువ లాభం వచ్చే చోట అమ్ముకోవచ్చునని ప్రధాని అన్నారు. కొత్త చట్టం వచ్చాక ఏ ఒక్క మండీ ని కూడా మూసివేయలేదని ఆయన చెప్పారు. ప్రభుత్వం ఎపిఎమ్సి లను నవీకరించడానికి 500 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తోందని ఆయన వివరించారు.
కాంట్రాక్టు వ్యవసాయం పాతదే…
కాంట్రాక్టు వ్యవసాయాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, అది మన దేశంలో సంవత్సరాలనాటి నుంచి సాగుతూ వస్తోందని వివరించారు. కాంట్రాక్టు సేద్యంలో కేవలం పంటలు లేదా ఉత్పత్తి లావాదేవీలు ఉంటాయి తప్ప భూమి రైతు వద్దే ఉండిపోతుందని, ఒప్పందానికి భూమితో ఎలాంటి ప్రమేయం ఉండదని ఆయన వివరించారు. చివరకు ఏదైనా ప్రాకృతిక విపత్తు వాటిల్లినా గానీ రైతు పూర్తి డబ్బును పొందుతాడన్నారు. కొత్త చట్టం ఊహించని లాభాలలో రైతుకు ఒక వాటా వచ్చేలా పూచీ పడిందని చెప్పారు.
కొత్త వ్యవసాయ చట్టాలకు సంబంధించి ప్రతి అంశంపైనా మాట్లాడటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. ఈ అంశం పై వివరంగా మరోసారి తాను అటల్ బిహారీ వాజ్పేయి జయంతి అయిన డిసెంబరు 25న మాట్లాడతానని ప్రధాన మంత్రి తెలిపారు.
డిసెంబర్ 25న ‘పిఎమ్ కిసాన్ సమ్మాన్ నిధి’ తాలూకు మరొక విడతను రైతుల బ్యాంకు ఖాతాలకు ఏకకాలంలో బదలాయించడం జరుగుతుంది.