దేశంలోని ఓ అగ్రశ్రేణి విద్యాసంస్థలో ఎంబీఏ చేసిన వ్యక్తి ప్రకృతి పంటలు పండించాలని నిర్ణయించుకుంటే ఏమవుతుందో? ఇప్పుడు చూద్దాం. ఏమాత్రం సారం లేని, చదునుగా కూడా లేని భూమిని కొన్న ఆ వ్యక్తి దాన్ని ఆర్గానిక్ ఎరువులు మాత్రమే వాడి వ్యవసాయానికి పనికొచ్చేలా మార్చేశాడు. ఆ భూమిలో ఇప్పుడు ఎంచక్కా ఆర్గానిక్ విధానంలో పసుపు, అల్లం, గోధుమ, ఇతర పంటలు బాగా పండిస్తున్నాడు. సహజసిద్ధ విధానంలో అతడు పండించిన పంట ఉత్పత్తులకు అధిక ధర కూడా లభిస్తోంది. తద్వారా చక్కని లాభాలు ఆర్జిస్తున్నాడు. గుజరాత్లోని సూరత్కు చెందిన 34 ఏళ్ల చింతన్ షా ఎంబీఏ చేసిన తర్వాత ఆర్గానిక్ రైతుగా మారి నలుగురికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.
చింతన్ షా 2015లో ముంబైలోని ఎన్ఎంఐఎంఎస్ విద్యాలయం నుంచి ఎంబీఏ పట్టా అందుకున్నాడు. గుజరాత్ రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్కు 65 కిలోమీటర్ల దూరంలోని దేవపుర గ్రామంలో 18 బిఘాలు (7.2 ఎకరాలు) కొనుగోలు చేశాడు చింతన్ షా. అది కూడా తన కుటుంబానికి పూర్తి సహజసిద్ధ, గ్యారంటీగా ఆరోగ్యాన్నిచ్చే ఆహారాన్నే సమకూర్చాలనే ఉద్దేశంతో షా ఈ నిర్ణయం తీసుకున్నాడు. అప్పటికి నెదర్లాండ్స్ లో ఆర్గానిక్ అగ్రికల్చర్లో మాస్టర్స్ డిగ్రీ చేస్తున్న షా సోదరుడు ప్రేరణ కలిగించాడు. అప్పటికే సహజసిద్ధ పంటలు పండిస్తున్న కొందరు రైతులను సోదరుడు పరిచయం చేయడంతో చింతన్ షాలో ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు ఆకర్షితుడయ్యాడు.
భూమిని కొన్న తర్వాత చింతన్ ముందుగా భారీ యంత్రాలను ఉపయోగించి చదును చేయించాడు. చదును చేస్తున్న సమయంలోనే ఆ నేల పైభాగం వ్యవసాయానికి అస్సలు పనికిరాదని గ్రహించాడు షా. దాంతో నిస్సారవంతంగా ఉండే భూమిని సారవంతంగా చేసి, సహజసిద్ధ విధానంలో పంటలు పండించే రైతుల గ్రూప్ ‘మధ్య గుజరాత్ సాజివ్ ఖేతి’లో తన పేరు నమోదు చేసుకున్నాడు. ఆ గ్రూపులోని రైతుల సలహాలు, సూచనలను పాటిస్తూ.. తన భూమిలో సగ భాగాన్ని ఆర్గానిక్ అగ్రికల్చర్ చేయడానికి అనువుగా మార్చుకున్నాడు. 4 బిఘాల్లో పసుపు పంట వేశాడు. ఓ 2.5 బిఘాల్లో గోధుమ పంట, ఇంకో అర బిఘాలో అల్లం పంట సాగు చేశాడు. చింతన్చింతన్ షా ఆర్గానిక్ మెన్యూర్, నెయ్యి, ఆవు పేడ, గో మూత్రం, నిమ్మ, బెల్లం, పసుపు పొడి, శనగపిండితో తయారు చేసిన ద్రవరూప జీవామృతాన్ని వినియోగించాడు.
చింతన్ షా కొన్నేళ్లుగా వ్యవసాయ క్షేత్రంలో పంట విధానాలను నేర్చుకోవడం నిత్య అభ్యాసంగా చేసుకున్నాడు. తన పొలంలో తక్కువ కాలంలో దిగుబడినిచ్చే కూరగాయలు, పండ్లు కూడా పండిస్తున్నారు. తద్వారా నేలలో సారం మరింత పెరిగేలా చూసుకుంటున్నాడు. తక్కువ పెట్టుబడితో సాగయ్యే పసుపు, అల్లం, గోధుమ పంటలు సాగుచేస్తున్నాడు. తొలి ఏడాది పసుపు పంటకు సూర్యరశ్మి ఎంతో అవసరమని, విత్తనాలను తూర్పు దిశగా నాటితే మొక్కలు మరింత ఏపుగా ఎదుగుతాయని, తద్వారా ఇంకా ఎక్కువ పంట దిగుబడి వస్తుందని చింతన్ షా చెబుతున్నాడు.