విజేతలు ఎక్కడి నుండో రారు.. మనలోనే ఉంటారు.. మన మధ్యలోనే పుడతారు.. మన మధ్యనే తిరుగుతారు.. మన మధ్యనే ఎదుగుతారు.. మన సమాజం గుర్తించే లోపు వారు ఎంతో ఎత్తుకు ఎదిగిపోతారు. అలా మన మధ్యనే పుట్టి, పెరిగి, మంచి స్థాయికి ఎదిగిన ఓ విజేత గురించి, అతను సాధించిన విజయాలు, ఆ వెనక కథ తెలుసుకుందాం..! సాగుబడిలో ఆ విజేత చేసిన ఆవిష్కరణ ఏంటో చూద్దాం..!
మట్టి అవసరం లేకుండానే మొక్కల సాగు చేసిన ఆ విజేత హైదరాబాద్ వాసి. కాంక్రీట్ జంగిల్ లో ఇలాంటి అద్భుతాన్ని సృష్టించారు..! మట్టి లేకుండా పంటలు పండిస్తున్నారు. మట్టి అవసరం లేని వ్యవసాయంలో విజయం సాధించారు. తద్వారా ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఫోర్బ్స్ జాబితాలో మన విజేత స్థానం దక్కించుకున్నారు. అతనే హైదరాబాద్ వాసి విహారి కనుకొల్లు.. అసన్ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ లో కామర్స్ గ్రాడ్యుయేషన్ చేశారు. ఆ తర్వాత సీఏ కూడా చేశారు. తాను చదివింది భిన్నమైన కోర్సు అయినా.. వ్యవసాయం మీదే విహారికి ఎక్కువ ఆసక్తి. దీంతో అధునాతన పద్ధతుల్లో వ్యవసాయం చేయడమెలా..? అనే అంశాలపై బాగా దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ‘హైడ్రోపోనిక్స్’ విధానం విహారి మనసును బాగా ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే 2017లో డాక్టర్ సాయిరాం పలిచెర్ల, శ్రీనివాస్ చాగంటితో కలిసి ‘అర్బన్ కిసాన్’ (UrbanKisaan) అనే స్టార్టప్ ఏర్పాటు చేశారు. హైడ్రోపోనిక్స్ ద్వారా రకరకాల పంటలు పండించడం మొదలుపెట్టిన విహారి విజయం సాధించారు.
రసాయనాలు అస్సలు వాడకుండా.. పూర్తి సేంద్రీయ పద్ధతిలో.. సాధారణ పంటల కన్నా చాలా తక్కువగా నీరు వాడుతూ చేసేదే ‘హైడ్రోపోనిక్స్’ వ్యవసాయ విధానం. హైడ్రోపోనిక్స్ అంటే.. మట్టి అవసరం లేకుండా కేవలం నీటితోనే మొక్కల్ని పెంచడం. కానీ.. మొక్కలకు పోషకాలు అందాలంటే.. మట్టి ఉండాలి అనేది మనందరికీ తెలిసిన విషయం.. ఆ సమస్యను ఎలా అధిగమిస్తారు..? అనే సందేహం మనకు రావచ్చు. దానికి హైడ్రోఫోనిక్స్ విధానంలో చక్కని పరిష్కారం ఉంది. మొక్కలకు మట్టి నుంచి అందాల్సిన పోషకాలు నీటిలో వేసి అందించాలి. మొక్కల వేళ్లు నిరంతరమూ నీటిలోనే ఉంటాయి కనుక.. ఆ నీటిలో పోషకాలు కలిపితే వాటిని మొక్కలు తీసుకుంటాయి. సరైన సమయంలో మొక్కలకు నీళ్లు, పోషకాలు అందిస్తే చాలు.. మట్టితో పని లేకుండానే మొక్కలు పెరుగుతాయి. సాధారణ పరిస్థితుల్లో పండించిన పంట కన్నా.. హైడ్రోపోనిక్స్ విధానంలో పండించిన పంటలకు దిగుబడి కూడా ఎక్కువే. అదే ఈ విధానంలో ఉన్న విశేషం. ఇలా పండించిన పంటల్లో అత్యధిక న్యూట్రిషన్ కూడా లభిస్తుంది.
నగర వాసులు తమ బాల్కనీల్లో కూడా హైడ్రోపోనిక్స్ విధానంలో పంటలు సాగు చేసుకునేందుకు కావల్సిన సదుపాయాలు అర్బన్ కిసాన్ సంస్థ అందిస్తోంది. దానికి అవసరమయ్యే ఫ్రేములు, పంటలకు కావల్సిన పోషకాల కిట్లు, ఇతర సామగ్రిని అందజేస్తోంది. దీంతో హైదరాబాద్ నగరంలో అనేక మంది హైడ్రోఫోనిక్స్ విధానంలో పంటల సాగు చేస్తున్నారు.
కాంక్రీట్ జంగిల్స్ గా మారిన నగరాలు, పట్టణాల్లో స్థలం లేక ఇబ్బంది పడేవారు హైడ్రోపోనిక్స్ విధానంలో చాలా తేలికగా తమకు అవసరమైన కూరగాయలు పండించుకోవచ్చని విహారి కనుకొల్లు తెలిపారు. ఈ విధానం నూరు శాతం సహజసిద్ధమైందని, పంటలకు కృత్రిమ ఎరువుల అవసరమే లేదని, చీడ పీడలు రావని, నీరు కూడా చాలా తక్కువగా అవసరం అవుతుందని చెప్పారు.
హైడ్రోపోనిక్స్ విధానంలో మొక్కల పెంపకం ప్రక్రియను స్మార్ట్ ఫోన్ యాప్ ద్వారా కూడా పర్యవేక్షించవచ్చు. మొక్కలకు ఎప్పుడు నీళ్లు పోయాలి? పోషకాలు ఎప్పుడు, ఏ మేరకు వేయాలి? పంట దిగుబడి ఎప్పుడు వస్తుంది?.. ఇలాంటి వివరాలు ఆ యాప్ ద్వారా మనకు తెలుస్తాయి. ఒక రకంగా ఇది అధునాతన వ్యవసాయ విధానమే అయినా.. పూర్తి సహజసిద్ధంగా ఈ విధానంలో మొక్కల పెంపకం ఉంటుంది.
హైడ్రోపోనిక్స్ ను నగరవాసులకు పరిచయం చేస్తూ ఈ రంగంలో దూసుకుపోతున్న అర్బన్ కిసాన్ కో ఫౌండర్ విహారి కనుకొల్లు ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. విహారి 2020 సంవత్సరానికి గాను ఆసియా ఇండస్ట్రీ, మాన్యుఫాక్చరింగ్ అండ్ ఎనర్జీ రంగాల్లో టాప్ 30 ఎంటర్ ప్రిన్యూర్లలో ఒకరిగా చోటు సంపాదించారు. అతి కొద్ది సమయంలోనే విహారి కనుకొల్లు ఈ ఘనత సాధించడం గమనార్హం..!
మరిన్ని వివరాలకు ఈ క్రింది చిరునామాల్లో సంప్రదించవచ్చు
Urban kisaan
Jublee Hills, Gachibowli, Manikonda, Begumpet, Kukatpally, Himayat Nagar, Sainikpuri, Nallagandla
Phone: +91 8430200200
www.urbankisaan.com