ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2020-21లో పలు పంటలను ఎంఎస్పీ ధరల ప్రాతిపదికన సేకరించడాన్ని కొనసాగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలైన పంజాబ్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, తెలంగాణ, ఉత్తరాఖండ్, తమిళనాడు, చండీగఢ్, జమ్ము,కాశ్మీర్, కేరళ, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్, అస్సాం, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ రైతుల నుంచి 2021 జనవరి 23 నాటికి ప్రభుత్వం 582.17 లక్షల మెట్రిక్ టన్నుల వరిని కొనుగోలు చేసింది. గత ఏడాది కొనుగోళ్ళతో పోలిస్తే ఇది 20.43% అధికం. మొత్తం 582.17 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్ళలో ఒక్క పంజాబ్ రాష్ట్రం నుంచే 202.77 లక్షల మెట్రిక్ టన్నుల మేరకు కొనుగోళ్లు జరిగాయి. ఇలా మొత్తం సేకరణలో 34.83% పంజాబ్ నుంచే జరిగింది. దాదాపు రూ. 109915.15 కోట్ల విలువ గల పంట సేకరణ జరగడంతో ఇప్పటి వరకు 83.83 లక్షల మంది రైతులు కెఎంఎస్ సేకరణ కార్యకలాపాల ద్వారా లబ్ధి పొందారు.
అలాగే రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతిపాదనల ఆధారంగా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, గుజరాత్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్, ఒడిషా, రాజస్థాన్, ఆంధ్ర ప్రదేశ్ల నుంచి పప్పుధాన్యాలు, నూనె గింజలను మద్దతు ధర పథకం కింద 51.92 లక్షల మెట్రిక్ టన్నుల మేరకు సేకరిస్తారు. మరోవైపు అదనంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి 1.23 లక్షల మెట్రిక్ టన్నుల కొబ్బరిని సేకరించేందుకు అనుమతిని మంజూరు చేశారు. అదనంగా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల ప్రతిపాదనల ఆధారంగా 2.50 లక్షల మెట్రిక్ టన్నుల పప్పుధాన్యాలు, నూనె గింజలు, కొబ్బరిని ధర మద్దతు పథకం కింద రబీ మార్కెటింగ్ సీజన్ 2020-2021లో సేకరించేందుకు గుజరాత్, తమిళనాడు రాష్ట్రాలకు అనుమతినిచ్చారు. ఇతర రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలలోనూ ఎంఎస్పి కింద పప్పు ధాన్యాలు, నూనె గింజలను సేకరిస్తారు. 2020-21 సంవత్సరానికిగాను ప్రకటించిన కనీస మద్దతు ధరల కింద రైతుల నుంచి ప్రత్యక్షంగా సేకరణ జరుగుతుంది. ఒకవేళ నోటిఫై చేసిన పంటకాలంలో మార్కెట్ ధరలు ప్రకటించిన మద్దతు ధరల కన్నా ఆయా రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలలో తక్కువగా ఉంటే, రాష్ట్రం నామినేట్ చేసిన ఏజెన్సీల ద్వారా కేంద్ర నోడల్ ఏజెన్సీలు సేకరణ నిర్వహిస్తాయి.
అలాగే, కర్ణాటక, తమిళనాడులో 3691 మంది రైతులకు లబ్ది చేకూరుస్తూ రూ. 52.40 కోట్ల మేరకు కనీస మద్దతు ధరతో 5,089 మెట్రిక్ టన్నుల కొబ్బరిని 23.01.2021 నాటికి కొనుగోలు చేయడం జరిగింది. ప్రస్తుతం కొబ్బరి, పెసరపప్పు అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రాలలో మార్కెట్ ధరలు కనీస మద్దతు ధరలకన్నా ఎక్కువగా ఉన్నాయి. కాగా, ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలు ఖరీఫ్ పప్పుధాన్యాలు, నూనె గింజలను సేకరించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాయి.
కనీస మద్దతు ధర కింద పత్తి సేకరణ కార్యకలాపాలు పంజాబ్, హర్యానా, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిషా, కర్ణాటకలలో సాఫీగా కొనసాగుతున్నాయి. సుమారు 18,01,799 మంది రైతులకు లబ్ధి చేకూరుస్తూ 23.01.2021 నాటికి రూ. 25568.30 కోట్ల విలువైన 8752758 పత్తి బేళ్ళను సేకరించడం జరిగింది.