మిరియాలలో కాల్షియం, పాస్పరస్, ఇనుము, సోడియం, పొటాషియం, విటమిన్్ ఏ, సీ ఉంటాయి. రక్తంలో ఇవి హిమోగ్లోబిన్ తయారీకి బాగా ఉపయోగపతాయి. మిరియాలలో యాంటి ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఫంగల్, యాంటి వైరల్ గుణాలు అధికం. జలుబుకు మిరియాలు మంచి ఔషధం. మిరియాల్లో ఉండే ‘పెపరిన్’ రసాయనం ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. మిరియాలు తీసుకుంటే షుగర్ లెవెల్స్ పెరగవు. గుండె జబ్బు, క్యాన్సర్, అల్జీమర్స్ లాంటి రోగాల నుంచి మిరియాలలో ఉండే రెస్వెరాట్రాల్ రక్షిస్తుంది.
నల్ల మిరియాలు జీర్ణ ఎంజైమ్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. కడుపు ఉబ్బరం, గ్యాస్, మలబద్ధకం లాంటి జీర్ణ సంబంధ సమస్యలు రాకుండా కాపాడుతుంది.పేగుల్లో మంచి బాక్టీరియాను పెంచేందుకు, చెడు బాక్టీరియాను తగ్గించేందుకు ఉపయోగపడతాయి. ఎక్కువ ఆకలిని మిరియాలు నియంత్రిస్తాయి. రోగ నిరోధకశక్తిని పెంచుతాయి మిరియాలు ఆర్థరైటిస్, ఆస్తమా, వాపు సమస్యలను తగ్గిస్తాయి. నల్ల మిరియాలు కొవ్వు కణాల పెరుగుదలను ఆపేస్తాయి. తద్వారా బరువు పెరిగే ప్రమాదం తగ్గుతుంది. మిరియాలు దగ్గు, శ్వాసకోశ, సైనసైటిస్ ఇబ్బందులను తగ్గిస్తాయి. శ్వాసకోశంలో వచ్చే ఇన్ఫెక్షన్లను మిరియాలు ఎదుర్కొంటాయి.
పైపర్ జాతికి చెందిన మిరియాలను ప్రాచీన కాలం నుండీ మన దేశంలో మసాలా దినుసుగా ఉపయోగిస్తున్నారు. వంటలలో మిరియాలు వేసుకుంటే ఆహారం రుచి రెట్టింపు అవుతుంది. మిరియాల రసాన్ని పలువురు ఇష్టపడతారు. మిరియాలను బ్లాక్ గోల్డ్ అని పిలుచుకుంటారు. ఎన్నో లాభాలున్న మిరియాలను మన దేశంలో ప్రధానంగా కేరళలో పండిస్తుంటారు. అయితే.. ఈ పంటను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా పండించవచ్చని, లాభాలు పొందవచ్చని ఆంధ్రప్రదేశ్లోని చాగల్లు మండలం కలవలపల్లి రైతు ముళ్లపూడి మురళీకృష్ణ నిరూపించారు. ఐదేళ్లుగా ఆయన 60 సెంట్లలో మిరియాల సాగు విజయవంతంగా చేస్తున్నారు. అంతే కాకుండా ఔత్సాహిక రైతులు, వ్యవసాయ విద్యార్థులకు మిరియాలలో రకాలు, ఏయే రకాలు మన దగ్గర సాగు చేస్తే అధిక ప్రయోజనమో ఆయన శిక్షణ ఇస్తున్నారు.వక్క, పామాయిల్ క్షేత్రాల్లో మిరియాల సాగు చేస్తారని అనుకుంటాం. అయితే.. అందుకు భిన్నంగా మురళీకృష్ణ ఖాళీ ప్రదేశంలో మిరియాల సాగు చేయొచ్చని ఆయన నిరూపించారు. మిరియాల సాగును వక్క, పామాయిల్ చెట్ల మీదకు ఎక్కించి చేయడం కంటే వాతావరణాన్ని నియంత్రిస్తూ చేసే ఓపెన్ సాగులో అధిక దిగుబడి వస్తుందని ఆయన అనుభవ పూర్వకంగా తెలిపారు. మిరియాల మొక్కలు 35 డిగ్రీల కన్నా ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటే వడిలిపోతాయి. అందుకే ఆయన షేడ్ నెట్ కింద మిరియాల సాగు చేపట్టారు. దీని వల్ల బయటి వాతావరణంలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నా షేడ్నెట్ కింద 35 డిగ్రీలకు మించదు. తద్వారా మిరియాల మొక్కలు బాగా పెరిగి దిగుబడి ఎక్కువగా వస్తుంది.
మిరియాలు సాగుచేయాలనుకునే వారు ముందుగా మిరియపు మొక్కలను ఎంపిక చేసుకోవాలి. అంటే… తమకు ఎంత కాలంలో పంట చేతికి రావాలో దాన్ని బట్టి ఆయా రకాలను ఎంపిక చేసుకోవాలి. మిరియాల పాదుల నుంచి లేత కొమ్మలు అంటే టాప్ షూట్ అంటే పైకి ఎదిగే మొక్కలు నాటుకుంటే ఏడాదిలో దిగుబడి వస్తుంది. బుష్ పెప్పర్ నాటుకుంటే రెండు నెలల్లోనే పంట వస్తుంది. ఈ రకం 365 రోజులూ కాపు కాస్తుంది. రన్నర్ షూటర్ అంటే భూమికి నాలుగు అడుగుల దూరం నుంచి మూడేళ్లకు దిగుబడి ఇస్తుంది. టాప్ షూట్ రకం గ్రౌండ్ లెవెల్ నుంచీ కాస్తుంది. దీని కణుపుల మధ్య దూరం తక్కువ ఉంటుంది. దీంతో రెమ్మలు త్వరగా వస్తాయి. దిగుబడి పెరుగుతుంది. రన్నర్ షూటర్ కణుపులు కాస్త దూరంగా ఉంటాయి. దీంతో రెమ్మలు తక్కువ వస్తాయి. దిగుబడి కూడా తగ్గుతుంది.
మిరియాల మొక్కలు నాటేందుకు మూడు అడుగుల ఎత్తు బెడ్లు తయారు చేసుకోవాలి. బెడ్కు బెడ్కు మధ్య దూరం మూడు అడుగులు ఉండాలి. మిరియాల పాదులు పైకి పాకేందుకు వీలుగా, షేడ్ నెట్ వేసుకునేందుకు అనువుగా ఉండేందుకు 14 లేదా 12 అడుగుల ఎత్తు పిల్లర్లు వేసుకోవాలి. మొక్కకు మొక్కకు మధ్య దూరం 8 అడుగులు ఉండాలి. మొక్కలు చిన్నగా ఉన్నప్పుడు కలుపు రాకుండా నేలపై మల్చింగ్ షీట్ వేసుకోవాలి. రెండు మూడేళ్లలో మిరియాల పాదులు పైకి ఎగబాకుతాయి కాబట్టి మల్చింగ్ షీట్ పాడైనా ఇబ్బంది ఉండదు. 60 సెంట్లలో షేడ్ నెట్ వేసేందుకు, డ్రిప్ సిస్టానికి, పిల్లర్లు వేసేందుకు మురళీకృష్ణకు రూ.10 లక్షల వరకు ఖర్చు అయింది.
మురళీకృష్ణ తమ క్షేత్రంలో ఒక్కో పోల్పై 4 మొక్కలు ఎక్కించేందుకు 360 పోల్స్ వేశారు. ఇలా మొత్తం 1800 మొక్కలు నాటారు. మిరియాల మొక్కలు ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెంటీగ్రేడ్ దాటితే వడిలిపోతాయి. అలా మిరియాల మొక్కలు వాడిపోకుండా ఉష్ణోగ్రత 35 డిగ్రీలు దాటకుండా నిలకడగా ఉంచేందుకే షెడ్ నెట్ వేశామన్నారు. రెండు వరుసల్లో షేడ్ నెట్లు వేసుకుంటే బయటి ఉష్ణోగ్రత కన్నా లోపల 10 డిగ్రీలు తగ్గుతుంది. అదే బుష్ పెప్పర్ రకానికైతే ఖర్చు తగ్గతుంది. టాప్ షూట్కు వేసినట్లు ఎక్కువ ఎత్తు పిల్లర్లు వేయక్కరలేదు. 8 నుంచి 9 అడుగుల పిల్లర్లు వేస్తే సరిపోతుంది. షేడ్ నెట్ కోసం ఇనుప పైపులు కాకుండా వైర్లతోనే వేసుకోవచ్చు. బుష్ పెప్పర్ అయితే ఎకరానికి 4.600 మొక్కలు నాటుకోవచ్చు. ఈ రకం ఒక్కో మొక్క నుంచి కిలో మిరియాలు దిగుబడి వస్తాయి. మిరియాలలో తేవము, శ్రీకర, శుభకర, పంచమి, పౌర్ణమి, ఇరిముండ, విజయ, శక్తి, మలబార్ ఎక్సెల్ లాంటి 13 రకాలు ఉన్నాయి. వీటిలో తేవము, శ్రీకర, శుభకర రకాలు తెలుగు రాష్ట్రాల వాతావరణానికి అనుకూలంగా ఉన్నాయని మురళీకృష్ణ చెప్పారు. వాటిలో తేవము రకం విజయవంతంగా పెరుగుతోందన్నారు. మిరియాల పంట ఏడాదికి రెండుసార్లు వస్తుంది. అర టన్ను దిగుబడి వస్తుంది. కేరళలో అయితే.. ఒకసారే పంట వస్తుంది.
మిరియాల సాగులో మురళీకృష్ణ రసాయన ఎరువులు, పురుగు మందులు వాడరు. కేవలం ఆర్గానిక్ ఎరువులు వేస్తున్నట్లు చెప్పారు. అంతకు ముందు జీవామృతం ఎక్కువగా వాడినట్లు చెప్పారు. తర్వాత వర్మీ కంపోస్ట్లో కొద్దిగా జీవామృతం వేస్తున్నామన్నారు. అంతకన్నా కొద్దిగా తక్కువ ఖర్చు అయ్యే విప్పపిండిని కుళ్లబెట్టి వాడుతున్నట్లు చెప్పారు. విప్ప పిండి వల్ల మొక్కకు కొమ్మల దూరం కూడా బాగా వస్తోందన్నారు. మిరియాల మొక్కలకు పైటాప్ డిసీజ్ వస్తుంది. అయితే.. ఆంధ్రప్రదేశ్ వాతావరణంలో అది రావడం లేదన్నారు. కేరళలో మిరియాల సాగును కొండ ప్రాంతంలో ఎత్తు పల్లాల్లో వేస్తారు కాబట్టి మొక్కల మొదళ్లలో నీరు నిల్వ ఉండి రూట్ రాట్ డిసీజ్ వస్తుంది. సమతల ప్రదేశంలో రూట్ రాట్ ఇబ్బంది ఉండదు. మలేషియన్ కిప్లి రకాన్ని, టాప్షూట్ని గ్రాఫ్టింగ్ చేస్తే డిసీజ్లు రాలేదన్నారు. ఇది సక్సెస్ఫుల్ వెరైటీ అని, దిగుబడి తగ్గలేదన్నారు. మిరియాల మొక్క రోజుకు 6 నుంచి 9 లీటర్ల నీరు సరిపోతుంది.
ఆంధ్ర, తెలంగాణలో రైతులు ఇప్పుడు మిరియాల సాగు పట్ల ఆసక్తి చూపుతున్నారని మురళీకృష్ణ తెలిపారు. వారికి టాప్షూట్ రకమే ఎక్కువగా రికమెండ్ చేస్తున్నట్లు చెప్పారు. రాయలసీమ ప్రాంతంలో పొడి వాతావరణం ఉంటుంది కాబట్టి అక్కడ టాప్షూట్ అంతగా ఉపయోగపడదన్నారు. అలాగే తుపాను గాలులు కూడా ఎక్కువ వస్తాయి కాబట్టి టాప్షూట్ రకం అక్కడ పనిచేయదు. రాయలసీమలో బుష్పెప్పర్ వేసుకుని, ఫాగర్స్ పెట్టుకుంటే బాగుంటుందన్నారు.
మిరియపు కాయలు లేత పసుపు రంగు లేదా కొద్దిగా ఎరుపు రంగులోకి వచ్చినప్పుడు కోతకు వచ్చినట్లు గుర్తించాలి. పరిపక్వం కాని కాయలను గ్రీన్ పెప్పర్గా తయారు చేస్తారు. మిరియాల గుత్తులను కోసిన తర్వాత కాయలను మిషన్లో వేసి వేరుచేయాలి. తర్వాత కాయలను వేడినీటిలో రెండు నిమిషాలు ముంచి ఉంచాలి. తర్వాత నాలుగు రోజులు ఎండబెడితే నలుపురంగులోకి మారిపోతుంది. మిరియాలు సాగు చేసే రైతులకు మార్కెటింగ్ ఇబ్బంది ఉండదు. మిరియాలు కిలో రూ.700 కు రైతు వద్దకే వచ్చి వ్యాపారులు తీసుకెళ్తారు. జాగ్రత్తగా సాగు చేసుకునే రైతులకు మిరియాల పంట లాభదాయకం అన్నారు మురళీకృష్ణ. మిగతా అన్ని పంటల కన్నా దీనితో ఎక్కువ లాభాలు వస్తాయన్నారు.